
శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలకు ఆదివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబరు 28 నుంచి 30వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి . ఇందులో భాగంగా 28న పవిత్రప్రతిష్ఠ, అక్టోబరు 29న మూలవర్లకు, ఉత్సవర్లకు, విమాన ప్రాకారానికి, ధ్వజస్తంభానికి, శ్రీ ఆంజనేయస్వామి వారికి పవిత్రాలు సమర్పణ నిర్వహిస్తారు. అక్టోబరు 30న రాత్రి పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగుస్తాయి.
యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ ఆలయంలో తెలియక దోషాలు జరుగుతుంటాయి. వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాది పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే ఆదివారం ఈ పవిత్రోత్సవాలకు అంకురార్పణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి , ఏఈఓ శ్రీ గోపీనాథ్, సూపరింటెండెంట్ శ్రీ వెంకటస్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ కిరణ్ , ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
