ముంగీస చెప్పిన కథ విన్నాక బ్రాహ్మణుడే గొప్పని అంగీకరించిన ధర్మరాజు

ధర్మరాజును అందరూ పొగుడుతుండగా చూసిన ముంగీస బీద బ్రాహ్మణుడి కథను వివరించడం మొదలు పెట్టాడు. “ఒక ఊరిలో ఒక పేద బ్రాహ్మణుడు ఉన్నాడు. అతని పేరు ‘సక్తుప్రస్తుడు’. అతని భార్య, కొడుకు, కోడలు అతని కుటుంబ సభ్యులు. పరిస్థితులు అనుకూలించక వీరికి కొన్ని రోజులపాటు బిక్ష దొరకదు. ఐదు రోజులపాటు పస్తులున్నాక ఒకరోజున ఒక శేరు జొన్న పిండి బిక్షగా దొరుకుతుంది. ఆ శేరు జొన్నపిండిని కుటుంబ సభ్యులు నలుగురికీ పంచుతాడు ఆ పేద బ్రాహ్మణుడు. వారు తినబోతుండగా ఒక ముసలి బ్రాహ్మణుడు ఆకలంటూ వస్తాడు. సక్తుప్రస్తుడు భక్తిశ్రద్ధలతో అతనిని గౌరవించి, తన భాగానికి వచ్చిన జొన్నపిండిని ఆయనకు ఆహారంగా ఇస్తాడు. ఐనా ఆ ముసలి బ్రాహ్మణుడికి ఆకలి తీరదు. దాంతో మిగిలిన ముగ్గురూ ఒకరొకరుగా తమ భాగాలని అతనికి ఇస్తారు.

అప్పుడు ఆ అతిథి కడుపు నిండిందంటూ ఆనందంతో క‌ృతజ్ఞతలు చెబుతాడు. ఆ తర్వాత తన నిజరూపాన్ని చూపిస్తాడు. ఆ అతిథి మరెవరో కాదు… సక్తుప్రస్తుని దానగుణాన్ని పరీక్షించడానికి వచ్చిన ‘ధర్మదేవత’. అతని అతిథి మర్యాదలకి, దానగుణానికి మహదానందాన్ని పొందిన ధర్మదేవత జీవించినంతకాలం సకల ఐశ్వర్యాలు కలగాలని, జీవితానంతరం స్వర్గలోక ప్రాప్తి కలగాలని వరమిస్తాడు!” అంటూ చెప్పడం ముగించింది ముంగీస. “ఇప్పుడు చెప్పండి ఆపేద బ్రాహ్మణుడు చేసిన దానం గొప్పదా? ఈ ధర్మరాజు చేసిన దానం గొప్పదా?” అని అడుగుతుంది. ‘తనకి ఎంతో వుండగా అందులోంచి కొంత భాగాన్ని అందరికీ దానమిచ్చిన వ్యక్తినే గొప్ప దానవంతుడని అంటే, ఆకలితో అలమటించిన క్షణంలో కూడా దానగుణాన్ని విడనాడని ఆ బ్రాహ్మణుడిని ఏమనాలి?’ అని ప్రశ్నిస్తుంది ఆ ముంగీస.

‘ఆపేద బ్రాహ్మణుడు జొన్నపిండిని దానం చేసిన సమయంలో గాలికి ఎగిరి కొంత నేలపై పడింది. ఆ పిండిలో దొర్లిన నా సగం శరీరభాగమంతా స్వర్ణమయమైపోయింది. అప్పటి నుంచి మరో సగ భాగం స్వర్ణమయమయ్యేంత గొప్ప దానం చేసే వ్యక్తి కోసం చూస్తున్నాను. ఎవరూ కనిపించలేదు!’ అంటుంది ఆ ముంగీస. ఇదంతా విన్న ధర్మరాజు “నిజమే ఆ పేద బ్రాహ్మణుడి దానగుణం ముందు తన దానగుణం ఏపాటిదని, ప్రేమతో, ఆర్తితో ఒక వ్యక్తి దానం చేయాలికాని, అహంకారంతో కాదు!” అని ఒప్పుకుంటాడు. మనం దానం చేసిన దాని విలువ అందుకునే వారి అవసరంపై ఆధారపడి నిర్ణయించాలే కాని, ఇచ్చేవారి స్తోమతపై ఆధారపడి కాదు అని ఈ కథ మనకు చెబుతుంది.

Share this post with your friends