శ్రీ ఆది శంకరాచార్యుల వారు, శిష్యులతో కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని దర్శించారు. గంగా నదిలో స్నానము చేసి, దర్శనానికి ఆలయము లోపలకి వెళ్లి, విశ్వేశరుని ఎదుట ‘నేను 3 దోషములు/పాపములను చేశాను. నన్ను క్షమించు’ అని ప్రాథేయ పడ్డారు. ఇది విన్న శిష్యులు ‘ఆచార్యులవారు, ఏమి పాపమలు చేశారని ప్రాయశ్చిత్త పడుతున్నారు ?’ అని అనుకున్నారు. ఒక శిష్యుడు ఏమిటి ఆ పాపము నేను తెలుసుకోవాలి అని ఆచార్యుల వారిని అడిగాడు. దానికి శ్రీ ఆది శంకరాచార్య ఇలా సమాధానము చెప్పారు.
1. నేను భగవంతుడిని సర్వాంతర్యామి, సర్వవ్యాపి అని వాక్కుతో స్తుతించాను. సృష్టి అంతా నిండి ఉన్న ఆ విశ్వేశ్వరుడిని చూడడానికి కాశి నగరానికి వచ్చాను. అంటే మనసా వాచా కర్మణా నేను నమ్మిన సత్యాన్ని నిత్య జీవితంలో ఆచరించలేక పోయాను. అది నేను చేసిన మొదటి దోషం.
2. తైత్త్రియ ఉపనిషద్లో “యతో వాచో నివర్తన్తే , అప్రాప్య మనసా సః ” అంటే భగవంతుడు మన బుద్ధికి ఆలోచనకి అందని వాడు ఇది తెలిసి కూడా శ్రీ కాశి విశ్వనాథ అష్టకం రాశాను. ఇది నేను చేసిన రెండవ తప్పు.
3. నిర్వాణ శతకంలో “న పుణ్యం న పాపం, న సౌఖ్యం న దుఃఖం. న మంత్రో న తీర్తం, న వేదా న యజ్ఞః
అహం భోజనం, నైవ భోజ్యం న భోక్త. చిదానందరూపం శివోహం శివోహం“ అని రాశాను.
అర్థం ఏంటంటే..నాకు పాప పుణ్యములు, సుఖ దుఃఖములు లేవు. మంత్ర జపములు తీర్థసేవలు , వేద యజ్ఞములు లేవు. భోజన పదార్థము, భోజనము, భోక్త (భుజించేవాడు) నేను కాదు! నేను చిదానంద స్వరూపుడను, శివుడను, శివుడను!
ఇంత రాసి కుడా నేను తీర్థయాత్రలు చేస్తున్నాను అంటే నేను రాసినవి, చెప్పినవి నేనే పాటించటంలేదు. అందుకనే నేను చేసిన ఈ మూడు తప్పులని మన్నించమని ,ఆ భగవంతుడిని క్షమాపణ కోరుకుంటున్నాను’’ అని శ్రీ ఆది శంకరాచార్యులు చెప్పారు. మన ఆలోచన, తీరు, మాటా అన్ని ఒకే లాగా ఉండాలి అని శ్రీ ఆది శంకరాచార్యుల వారి కథ మనకి తెలియజేస్తోంది.