తిరుమల కంపార్ట్‌మెంట్లలో భక్తులతో మాట్లాడిన అధికారుల బృందం

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్రీ జె శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో శ్రీమతి గౌతమితో కలిసి శుక్రవారం తిరుమలలోని పలు ప్రాంతాలను పరిశీలించి, పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారి భక్తులకు అందిస్తున్న సౌకర్యాలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. మొదట అన్నమయ్య భవనంలోని ఏపీటీడీసీ నడుపుతున్న హోటల్‌ని, పీఏసీ-2, మాధవ నిలయాన్ని పరిశీలించి, నిర్మాణంలో ఉన్న కొత్త పీఏసీ -5ని కూడా తనిఖీ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు ఉండేలా నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.

అంతకుముందు ఎస్వీ మ్యూజియంను ఆధునీకరిస్తున్న టిసిఎస్ బృందంతో కలిసి సందర్శించి పనుల పురోగతిని పర్యవేక్షించారు. అనంతరం పాంచజన్యం వసతి గృహం వద్ద నూతన వంటశాల, బయట ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, విక్యూసీ కంపార్ట్‌మెంట్లు, అక్షయ కిచెన్‌లను ఈఓ పరిశీలించారు. శ్రీ మలయప్ప స్వామివారి దర్శనం కోసం కంపార్ట్‌మెంట్లలో యాత్రికులతో మాట్లాడి, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఈ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఈ 2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, డీఈ ఎలక్ట్రికల్ శ్రీ రవిశంకర్ రెడ్డి, మ్యూజియం ఇంచార్జి అధికారిణి శ్రీమతి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Share this post with your friends