పరమ పవిత్రమైన మాసాల్లో వైశాఖ మాసం కూడా ఒకటి. ఈ మాసంలో వ్రతం ఆచరిస్తే చాలా మంచిదట. అసలు ఆ వ్రత మహత్యం ఏమిటనే విషయాన్ని అంబరీషుడికి స్వయంగా నారదుల వారే వివరించారు. మరి నారద మహర్షి ఏ విధంగా వివరించాడో తెలుసుకుందాం. అంబరీషుడికి నారద మహర్షి తనకు వైశాఖ మాసమంటే అత్యంత ఇష్టమని.. దానికి గల కారణాలను సైతం వివరించాడు. అనంతరం వైశాఖ మాస విశిష్టతను వివరించమని కోరడంతో ఈ మాసంలో జలదానం విశిష్టతను తెలిపే ఓ కథను అంబరీషునికి నారదుడు చెప్పాడు.
పూర్వం ఇక్ష్వాకు వంశంలో హేమాంగదుడను రాజు ఉండేవాడు. అతడు మంచి పరిపాలనా దక్షుడు మాత్రమే కాకుండా గొప్ప దానకర్ణుడు. ఈ క్రమంలోనే ఆ రాజు లెక్కలేనన్ని గోవులను దానం చేయడమే కాకుండా భూదానము, తిలదానము మొదలగు అనేక దానములు చేశాడు. అసలు హేమాంగదుడు చేయని దానమే లేదన్నట్టుగా ప్రసిద్ధి చెందాడు. అనేక యజ్ఞములను సైతం చేశాడు. అయితే ఇన్ని దానాలను చేసిన హేమాంగదుడు ఎందుకోగానీ జలదానం మాత్రం చేయలేదు. జలం అనేది సులభంగా దొరికేది కాబట్టి దానిని దానం ఇవ్వడమెందుకన్న అపోహలో ఉండేవాడు. ఈ క్రమంలోనే రాజకు జలదాన గొప్పదనాన్ని ఇక్ష్వాకు వంశ కులగురువు అయిన వశిష్ఠుడు ఎన్నో సార్లు వివరించినా అతను పట్టించుకోలేదు. ఆ తరువాత ఏం జరిగిందో తదుపరి కథనంలో తెలుసుకుందాం.