
మైసూర్ దసరా ఉత్సవాల్లో కీలకమైన జంబూసవారీ నిన్న జరిగింది. జంబూ సవారీని తిలకించేందుకు కర్నాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, పెద్ద ఎత్తున సామాన్య ప్రజానీకం మైసూర్ ప్యాలెస్కు తరలి వచ్చారు. శక్తినామంతో మైసూర్ నగరం దద్దరిల్లింది. గజరాజులు సైతం జగన్మాత సేవలో తరించాయి. మైసూర్ చాముండేశ్వరీ అమ్మ వారిని పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. గతంలో కంటే వైభవంగా ఈ ఏడాది మైసూర్లో అక్కడి ప్రభుత్వం దసరా ఉత్సవాలను నిర్వహించింది.
ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో రైతాంగం కుదుటపడింది. దీంతో ఈసారి మైసూర్ దసరా ఉత్సవాలు అంబరాన్నంటాయి. దేశ విదేశాల నుంచి ఈ ఉత్సవాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు. అధికారులు సైతం వీరందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. కన్నడ సంస్కృతిని ప్రతిబింబిచేలా శకటాలను ప్రదర్శించారు. మైసూర్ ఉత్సవాల కోసం రాష్ట్రం నలుమూలల నుంచి కళాకారులు వచ్చి ప్రదర్శనలు ఇచ్చారు. 1610 నుంచి మైసూర్ దసరా ఉత్సవాలను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు.
