నిజమైన భక్తి ఎక్కడ ఉంటుందంటే..

నిజమైన భక్తి ఎక్కడుంటుంది? పూజించడంలోనా.. ఇంకెక్కడైనా ఉంటుందా? అనే సందేహం రాకమానదు. నిజమైన భక్తి దైవాన్ని పూజించడంలో మాత్రమే ఉండదు. ప్రతి మనిషిలోనూ దైవాన్ని చూసినప్పుడు అది పరిపూర్ణమవుతుందని పెద్దలు చెబుతారు. మానవ సేవ అనేది భగవంతుడికి చేరువయ్యే మార్గమనేది పండితుల భావన. తోటివారికి సహాయం చేయడం ద్వారా భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రులవుతారట. జీవితంలో ప్రశాంతత, సంతోషం ఉండాలంటే, మనసులో దయ, కరుణ నింపుకోవాలి. ఈ సద్గుణాలే దైవానికి మరింత దగ్గర చేస్తాయి.

ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ ఒంటరిగా జీవించలేరు. ఒకరికొకరు తోడుగా ఉండటం, కష్టాల్లో చేయూతనివ్వడం ద్వారానే ఈ సమాజం సంతోషంగా ఉంటుంది.

భక్తి కేవలం ప్రార్థనలకు, పూజలకు మాత్రమే పరిమితం కాదు. చేసే ప్రతి మంచి పని, పలికే ప్రతి మంచి మాట భక్తిలో భాగమే. మన హృదయం కరుణతో నిండినప్పుడు అది భగవంతుని ఆలయమవుతుంది. అలాంటి మనసు కలిగినవాడే నిజమైన భక్తుడు. మానవత్వం లేకుండా చేసే పూజ, భక్తి ఫలహీనమవుతుంది. దయ, సాయం, సత్యం కలిసే దైవసేవకు మకుటాయమానాలుగా చెబుతారు.

Share this post with your friends