సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించాలనుకున్నప్పుడు పురోహితుడిని పిలిచి ఆయనతో వ్రతం జరిపించుకుంటూ ఉంటాం. ముందుగా ఒక పీటను పువ్వులు, పసుపు, కుంకుమలతో అందంగా అలంకరిస్తారు. ఆపై స్వామివారి చిత్ర పటాన్ని దానిపై ప్రతిష్టించిన అనంతరం కలశాన్ని సైతం ప్రతిష్టించుకుని పూజను ప్రారంభిస్తారు. సత్యనారాయణ స్వామి వ్రతానికి ఎంత మహత్యం ఉందో, ఈ వ్రతంలో స్వామికి నివేదించే ప్రసాదానికి కూడా అంతే మహిమ ఉంటుంది. సత్యనారాయణ స్వామి ప్రసాదం.. ఇంట్లో అయినా.. ఆలయంలో పెట్టినా కూడా అత్యంత ప్రాధాన్యత ఉంటుంది.

అసలు సత్యనారాయణ స్వామి వ్రతం మొత్తం చేసుకున్న మీదట.. ప్రసాదాన్ని తప్పనిసరిగా స్వీకరించాలి. ప్రసాదాన్ని చులకన చేయడం కానీ చేస్తే ఎలాంటి అనర్ధాలు కలుగుతాయో వ్రత కథలో వివరించి ఉంటుంది. రవ్వ, పంచదారలతో స్వామివారి ప్రసాదాన్ని తయారు చేస్తారు. సత్యనారాయణ స్వామివారి ప్రసాదం రుచి, శుచిలోనే కాకుండా మహిమలో కూడా ఉన్నతమైనదిగానే చెబుతారు. అందుకే సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని అడిగి మరీ తీసుకుంటారు. సత్యనారాయణ స్వామి వ్రతం అనేది కేవలం ఒక పూజ మాత్రమే కాదు, సత్యాన్ని ఆచరిస్తూ, కష్టాలను తొలగించమని భగవంతుడిని శరణు వేడుకుంటూ, మానసిక ప్రశాంతతను పొందే అద్భుతమైన మార్గంగా చెబుతారు.
