
హిందూ సంప్రదాయంలో పూజలకు, వ్రతాలకు ఎంత గొప్ప స్థానం ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలోనే తీర్థయాత్రలకు కూడా అంతే గొప్ప స్థానముంది. తీర్థయాత్రలు నిర్వహిస్తే పుణ్యంతో పాటు.. ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా తీర్థయాత్రలు ఎందుకు చేయాలి? ఎవరు చేయాలి? అంటే వయసు మళ్లిన వారు మాత్రమే చేయాలా? ఎవరైనా చేయవచ్చా? వంటి విషయాలను తెలుసుకుందాం. సాధారణంగా క్షేత్ర దర్శనం అనేది వయసు మళ్లిన వారు మాత్రమే చేయాలని అంటారు.
వాస్తవానికి వయసులో ఉండగానే తీర్థయాత్రల సందర్శన పూర్తి చేయాలట. ఆ జ్ఞాపకాలు పంచే అనుభూతిని మాత్రం వయసు మళ్లిన తరువాత అనుభవించాలని చెబుతారు. ఎందుకంటే వయసు మళ్లిన తరువాత కావాల్సినంత సమయం అయితే ఉంటుంది కానీ పుణ్యక్షేత్రాల సందర్శనకు శరీరం సహకరించకపోవచ్చు. కాబట్టి ఒంట్లో సత్తువ ఉన్నప్పుడే దివ్య క్షేత్రాలను సందర్శించుకోవాలట. అయితే భగవంతుడు సర్వాంతర్యామి కదా.. ఆయనను వెదుక్కుంటూ ఎక్కడికో వెళ్లడమేంటనే సందేహం కూడా రావొచ్చు.. అయితే పుణ్యక్షేత్రాలకు ఉండే స్థల మహత్స్యం కోసమైనా వెళ్లాలట.
