సృష్టిలో సంక్లిష్టమైనది ఏంటంటే..

భగవంతుడు ప్రసాదించిన – మానవ జన్మ ఎలా తరింప చేసుకోవాలో – నిర్ణయం మనదేనని పండితులు చెబుతారు. సృష్టిలో మానవజన్మ ఎంతో క్లిష్టమైనది. మానవుడు పుట్టడంతోనే అతనిలో పదకొండు ఇంద్రియాలు మమేకమై ఉంటాయి. అవి లేకుంటే అతడు మనుగడ సాగించలేడు.

ఆ పదకొండులో….

అయిదు జ్ఞానేంద్రియాలు, అయిదు కర్మేంద్రియాలు, మనసు ఉన్నాయి.

జ్ఞానేంద్రియాలు..

1. శ్రోత్రం (చెవి),
2. త్వక్‌ (చర్మం),
3. చక్షుషీ (కన్నులు),
4. జిహ్వ (నాలుక),
5. నాసికా (ముక్కు)

కర్మేంద్రియాలు..

1. పాయు (మలద్వారం),
2. ఉపస్థ (మూత్రద్వారం),
3. హస్త (చేతులు),
4. పాద (కాళ్లు),
5. వాక్‌(మాట)అనేవి కర్మేంద్రియాలు.

ఈ పదింటికి చివర మనసు ఉంటుందట. వీటినే ఇంద్రియ సమూహంగా పేర్కొంటారు. ఈ పదకొండు ఇంద్రియాలు పదకొండు విధాలుగా మనిషిని కష్టపెడతాయి. ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తాయి. ఇంద్రియ నిగ్రహం అనేది మనిషికి బతుకు సమస్య. ఇంద్రియాలు గుర్రాల వంటివని, రథాన్ని నడిపే సారథి పగ్గాలను సమర్థంగా పట్టుకొని అదుపు చేయకపోతే గుర్రాలు ఇష్టం వచ్చిన దిక్కుకు ప్రయాణిస్తాయని, అప్పుడు ప్రమాదాలు సంభవిస్తాయని, కనుక సారథి వంటి మనిషి ఇంద్రియాలు అనే గుర్రాల పగ్గాలు లాగి అదుపులో పెట్టుకోవాలని అంటాడు మనువు.

1. మనిషి సంయమనాన్ని కోల్పోతే చెవులు చెడు మాటలనే వింటాయి.
2. చర్మం పనికిరాని స్పర్శను కోరుతుంది.
3. కళ్లు అశ్లీలాన్ని చూస్తాయి.
4. నాలుక అనారోగ్యకరమైన రుచులను కోరుతుంది.
5. ముక్కు దుర్గంధాలనే స్వీకరిస్తుంది.
6. మల, మూత్రద్వారాలు పనిచేయకుండా పోతాయి.
7. కాళ్లూ చేతులూ హింసను ఆచరిస్తాయి.
8. మాట అదుపు తప్పుతుంది. ఇలా పది ఇంద్రియాలు చేసే నష్టం ఒక ఎత్తయితే, మనసు అనే పదకొండో ఇంద్రియం చేసే నష్టం ఒక ఎత్తు.

Share this post with your friends