శ్రీకృష్ణుడికి సంబంధించిన ఆసక్తికర కథ ఇది..

పిలిస్తే దేవుడు శ్రీకృష్ణుడని అంటారు. దీనికి సంబంధించిన ఒక కథ ఉంది. రాజస్థాన్ లో రమేష్ చంద్ర అనే దయగల ఒక శ్రీకృష్ణుని భక్తుడు ఉండేవాడు. అతనికి ఒక మందుల దుకాణం ఉండేది. షాపులో ఒక మూలన శ్రీకృష్ణుడి చిన్న చిత్రం ఉంది. ప్రతిరోజూ దుకాణం తెరిచిన తర్వాత, తన చేతులు కడుక్కొని, ఆ దేవుని బొమ్మను శుభ్రం చేసి, దీపం, ధూపం మొదలైన వాటిని చాలా భక్తితో వెలిగించేవాడు. అతనికి రాకేష్ అనే కొడుకు కూడా ఉన్నాడు. తన చదువు పూర్తి చేసి తండ్రితో పాటు దుకాణంలో కూర్చునేవాడు. తన తండ్రి రోజూ ఇదంతా చేయడం చూస్తూ ఉంటాడు. నవీన యుగంలో చదువుకున్న యువకుడు అవడంవల్ల తన తండ్రికి , దేవుడు అంటూ ఎవరూ లేరని, ఇదంతా మన మనస్సు భ్రమ అని వివరించేవాడు.

సూర్యుడు తన రథంలో విశ్వం చుట్టూ తిరుగుతున్నాడని శాస్త్రాలు చెబుతున్నాయి. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని సైన్స్ రుజువు చేసిందని చెప్పువాడు. ఇలా ప్రతి రోజూ సైన్స్ నుండి కొత్త ఉదాహరణలను ఇస్తూ, దేవుడు లేడని నిరూపించడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు.తండ్రి అతనిని ఆప్యాయంగా చూసి నవ్వేవాడు తప్ప ఈ అంశంపై వాదించడానికి లేదా చర్చించడానికి ఇష్టపడేవాడు కాదు.కాలం గడిచేకొద్దీ తండ్రి వృద్ధుడయ్యాడు. ఇప్పుడు తన అంతం ఆసన్నమైందని బహుశా అతను తెలుసుకున్నాడో ఏమో కానీ ఒకరోజు తన కొడుకుతో.. ‘‘నువ్వు భగవంతుడిని నమ్మినా నమ్మకపోయినా, నువ్వు కష్టపడి పని చేస్తూ, దయతో, నిజాయితీగా ఉంటే చాలు. నా మరణానంతరం దేవుని బొమ్మను శుభ్రం చెయ్యి; రెండవది, నువ్వు ఎప్పుడైనా ఏదైనా సమస్యలో ఇరుక్కుంటే, చేతులు జోడించి, శ్రీకృష్ణునికి నీ సమస్యను చెప్పుకో’’ అని చెప్పాడు.

కొడుకు దీనికి అంగీకరించాడు.కొన్ని రోజుల తర్వాత తండ్రి చనిపోయాడు, కాలం అలా గడిచిపోతూ ఉంది. ఒకరోజు జోరున వర్షం కురుస్తోంది. రాకేష్ రోజంతా షాపులో కూర్చునే ఉన్నాడు, కస్టమర్లు కూడా చాలా తక్కువగా ఉన్నారు. ఆపై కరెంటు కూడా ఇబ్బంది పెడుతోంది. అకస్మాత్తుగా వర్షంలో తడుస్తూ ఓ కుర్రాడు పరుగు పరుగున వచ్చి “అన్నా .. ఈ మందు కావాలి.. మా అమ్మకి చాలా జబ్బుగా ఉంది .. వెంటనే ఈ మందు నాలుగు చెంచాలు వేస్తేనే .. అమ్మ బతుకుతుందని డాక్టర్ చెప్పారు. నీ దగ్గర ఈ మందు ఉందా?” అని అడిగాడు. రాకేష్ మందుచీటి చూసి వెంటనే తన వద్ద ఉందని వెంటనే తీసి ఇచ్చాడు. బాలుడు చాలా సంతోషించి, వెంటనే మందుసీసాతో వెళ్ళిపోయాడు.

అబ్బాయి వెళ్లిన కొద్దిసేపటికే రాకేష్ కౌంటర్ వైపు చూడగానే చెమటలు పట్టాయి. కొద్దిసేపటి క్రితం ఓ కస్టమర్ ఎలుకల మందు సీసా తిరిగి ఇచ్చేసి వెళ్ళాడు. లైట్లు వెలగకపోవడంతో పొరపాటున బాలుడికి ఆ మందు ఇచ్చేశాడు. రాకేష్ నోటి వెంట అసంకల్పితంగా ‘ఓరి భగవంతుడా’ అీనే మాట వచ్చింది. అప్పుడు తండ్రి మాటలు గుర్తొచ్చి బరువెక్కిన హృదయంతో శ్రీకృష్ణుని చిత్రపటం ముందు నిలబడి ఏ అవాంఛనీయ సంఘటనా జరగకుండా చూడమంటూ ప్రార్థించాడు. అప్పుడే వెనుక నుంచి ఒక గొంతు వినిపించింది… “అన్నా, నేను బురదలో జారిపోయాను, మందు సీసా కూడా పగిలిపోయింది! దయచేసి నాకు మరో సీసా ఇవ్వవా” అని అడిగాడు. ప్రేమపూరితమైన చిరునవ్వుతో ఉన్న భగవంతుని చిత్రాన్ని చూస్తూండగా రాకేష్ ముఖంపై కన్నీళ్లు కారడం మొదలయ్యాయి. అప్పుడు భగవంతునిపై విశ్వాసం ప్రారంభమైంది.

Share this post with your friends