శిలాదుడనే మహర్షి కథ గురించి తెలుసుకుంటున్నాం కదా. శిలాదుడు సంతానం కోసం శివయ్య గురించి తపస్సు చేయగా.. స్వామివారు ప్రత్యక్షమై సంతాన భాగ్యాన్ని ప్రసాదించాడు. శివుడి నుంచి వరాన్ని పొందిన శిలాదుడు సంతానం కోసం యజ్ఞం నిర్వహిస్తుండగా, ఆ యోగాగ్ని నుంచి ఒక బాలుడు ప్రభవించాడు. శిలాదుడు ఆనందపరవశుడయ్యాడు. సంతోషంతో ఆ బాలుడికి ‘నంది’ అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకోసాగాడు. ‘నంది’ అంటే అర్థం సంతోషాన్ని కలిగించేవాడు. నందీశ్వరుడు యోగాగ్ని నుంచి జన్మించినవాడు కావడంతో అపారమైన మేథస్సుతో ఉండేవాడు.

చిన్నతనంలోనే నంది సకల వేదాలను అభ్యసించాడు. అయితే ఒకరోజు శిలాదుని ఆశ్రమానికి మిత్రావరుణులు అనే దేవతలు వచ్చి నందిని చూసి మురిసిపోయారు. నంది కూడా వారిని చూసిన వెంటనే అద్భుతంగా అతిథి మర్యాదలు చేశాడు. అవి చూసిన వారంతా పరవశించిపోయి వెళ్లేటప్పుడు ‘దీర్ఘాయుష్మాన్భవ’ అని దీవించబోయి ఆగిపోయారు! నంది వంక దీక్షగా చూసి మిత్రావరుణులు ఎందుకలా ఆగిపోయారో అర్థంకాక శిలాదుడు అసలు విషయమేంటో చెప్పమని వారిని అర్థించాడు. అప్పుడు వారు త్వరలోనే నంది ఆయుష్షు త్వరలోనే తీరిపోనుందని శిలాదుడికి చెబుతారు. ఆ తరువాత ఏం జరిగిందో మరో కథనంలో తెలుసుకుందాం.
