మార్కాపురం జిల్లా రాచర్ల మండలం. జె.పుల్లలచెరువు గ్రామంలో రంగనాథస్వామి కొలువుదీరిన నెమలి గుండం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇసుకగుండం దగ్గర చెంచు జాతికి చెందిన బయ్యన్న, బయ్యక్క అనే దంపతులు నివసించేవారు. వారికి రంగలక్ష్మి అనే ఒక కూతురు ఉండేదట. ఆమె చిన్ననాటి నుంచే శ్రీ మహా విష్ణువుకి పరమ భక్తురాలు. అంతేకాకుండా విష్ణుమూర్తినే తన భర్తగా భావించేదట.. మానవమాత్రులను వివాహం చేసుకోవడానికి ఒప్పుకునేది కాదు. కానీ కుల పెద్దలు కట్టుబాట్ల పేరుతో ఆమెకు బలవంతంగా వివాహం జరిపించబోయారట. అప్పుడు ఆమె అక్కడ నుంచి నెమలిగుండం వచ్చేసిందట.

నెమలిగుండంలో తపస్సు చేసుకుంటున్న మయూర మహర్షిని కలిసి తన మనసులోని మాటను విన్నవించుకుందట. మయూర మహర్షి సూచన మేరకు రంగలక్ష్మి శ్రీ మహావిష్ణువును భర్తగా పొందడానికి తీవ్రమైన తపస్సు చేయసాగింది. కొంతకాలానికి ఆమె తపస్సును మెచ్చిన శ్రీరంగనాథుడు ప్రత్యక్షమయ్యాడట. ఆమె కోరికను మన్నించి స్వామివారు రంగలక్ష్మిని అనుగ్రహించి ఆమెను పరిణయమాడి తనలో ఐక్యం చేసుకున్నాడు. ఆ తరువాత మయూర మహర్షి కోరిక మేరకు ఆ ప్రాంతంలో శ్రీ మహావిష్ణువు రంగనాథుడిగా స్వయంభువుగా అవతరించాడు. అనంతర కాలంలో శ్రీరంగనాథునికి మయూర మహర్షే ఆలయాన్ని నిర్మించినట్లుగా ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది.
