నందిని దీవించబోయి ఆగిపోయిన మిత్రావరణులనే దేవతలు. శిలాదుడు వారిని అర్థించి కారణం తెలుసుకున్నాడు. తన కుమారుడు నంది ఆయుష్షు త్వరలోనే తీరిపోనుందని తెలుసుకుని విచారంలో మునిగిపోయాడు. కానీ నంది మాత్రం చలించలేదు. శివయ్యపైనే నంది భారం వదిలేశాడు. శివుడి కోసం నంది తపస్సు చేయడం మొదలుపెట్టాడు. నంది తపస్సుకు శివుడు ప్రత్యక్షమయ్యాడు. పరమేశ్వరుడిని చూసిన నందికి నోట మాట రాలేదు. పైగా ఆయన పాదాల చెంత ఉండే అదృష్టం తనకు లభిస్తే బాగుండని మనసులో అనుకున్నాడు.

అందుకే తన ఆయుష్షు గురించో మరొకటో కోరకుండా కలకాలం శివయ్య పాదాల చెంత ఉండే వరం కోరాడు. శివయ్య కూడా నంది భక్తిని గ్రహించి అలాంటి భక్తుడు తన చెంత ఉంటే శివునికి కూడా సంతోషమే కదా అనుకున్నాడు. అందుకే నందిని వృషభ రూపంలో తన వాహనంగా ఉండిపొమ్మంటూ అనుగ్రహించాడు. అప్పటి నుంచి శివుడికి నంది ద్వారపాలకుడిగా మారాడు. శివయ్యను కాచుకుని ఉంటూ.. ప్రమథ గణాల్లో ముఖ్యునిగా కైలాసానికి రక్షణగా ఉంటూ వస్తున్నాడు. శివుడికి సంబంధించిన ఎన్నో కథల్లో నంది కథ కూడా ఉంటుంది. ఆయా కథల్లో శివుని పట్ల నందికి ఉన్న స్వామి భక్తి, దీక్ష కనిపిస్తూ ఉంటాయి.
