
శంఖాల్లో ఒకటో, రెండో రకాలో కాదు.. చాలా రకాలున్నాయి. ముఖ్యంగా వీటి పేర్లను ఆకారం, సైజు, లక్షణాలను బట్టి పెట్టడం జరిగిందని చెబుతారు. ఇక శంఖాలకు లక్ష్మీ, మధ్యమావర్త, కామధేను, గోముఖ, దేవ, గరుడ, సుఘోష, రాక్షస, మణిపుష్పక, శని, కేతు, కూర్మ, రాహు వంటి పేర్లున్నాయి. శంఖం అనేది పురాణాల ప్రకారం పవిత్రతకు చిహ్నంగా పేర్కొంటారు. దీనిని ఊదడం వలన ఆ ప్రాంతంలో ఆధ్యాత్మికతతో పాటు పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని తెలుస్తోంది.
పూజలు వంటి పవిత్ర కార్యక్రమాలను ప్రారంభించడానికి ముందు శంఖాన్ని ఊదాలని చెబుతారు.
ఇలా శంఖాన్ని ఊదితే పూజకు, దైవ సేవకు ఆ ప్రదేశం అనుకూలంగా మారుతుందట. ఈ శంఖనాదం పవిత్రమైన ఆరంభాన్ని సూచించడమే కాకుండా.. దేవతలకు పిలుపునివ్వడమేనని చెబుతారు. శంఖం ఊదడం వలన మరికొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటంటే.. శంఖం ఊదడం వలన దాని నుంచి వచ్చిన శబ్దం కారణంగా వాతావరణంలోని రాజసిక, తామసిక శక్తులు తొలగిపోవడమే కాకుండా.. శాంతి, పవిత్రత వంటివి ఆ ప్రదేశంలో ఉంటాయట. అలాగే శంఖం ఊదిన వారికి శారీరక, మానసిక సమస్యలనేవే ఉండవని చెబుతారు. లంగ్స్ పనితీరు మెరుగుపడి, శ్వాసక్రియ బాగుంటాయట. అలాగే ఊపిరితిత్తులతో పాటు ముఖం, కడుపులోని కండరాలు సైతం బలపడతాయట.
