హస్తినాపురం అంటే తెలియని హిందువంటూ ఉంటాడా? మహాభారతంలో ఈ హస్తినాపురాన్ని రాజధానిగా చేసుకునే పరిపాలన మొత్తం సాగుతుంది. అయితే నేటి ఢిల్లీని హస్తినగా కూడా సంబోధించడం జరుగుతోంది. సంబోధన వరకేనా? నిజంగానే ఢిల్లీయే హస్తినాపురమా? చరిత్రం ఏం చెబుతోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. కురు రాజ్యానికి రాజధాని అయిన హస్తినాపురం.. మహాభారతం ప్రకారమైతే గంగా నది ఒడ్డున ఖాండవప్రస్తం అనే అడవి నుంచి కొద్ది దూరంలో ఉండేది. దీని ప్రకారం చూస్తే మాత్రం ప్రస్తుత భారత రాజధాని ఢిల్లీ.. ద్వాపరయుగంలో హస్తినాపురం ఒకటి కాదని తెలుస్తోంది.

ఈ హస్తినాపూర్ ఢిల్లీ అయితే కాదు కానీ.. అసలు హస్తినాపురం అనేది లేదని కాదు.. ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లాలో హస్తినాపురం అనే పట్టణం ఉంది. ఇది గంగానది కుడి ఒడ్డున ఉండటంతో ఇదే అప్పటి కురు సామ్రాజ్య రాజధాని అని భావిస్తున్నారు. అంతేకాకుండా అక్కడ జరిపిన తవ్వకాలలో పెయింటెడ్ గ్రే వేర్ సుమారు 1200-600 BCE నాటివని తేలింది. ఇది మాత్రమే కాకుండా నార్తర్న్ బ్లాక్ పాలిష్డ్ వేర్ కూడా బయటపడ్డాయి. ఇవన్నీ కూడా నాటి హస్తినాపురం ఇదేనని తేల్చి చెబుతున్నాయి. అంతేకాకుండా ఈ ప్రాంతంలో బయటపడ్డ 7వ శతాబ్దపు రాగి పలకలో “హస్తినాపుర” గురించి సైతం ప్రస్తావించబడటం కూడా దీనికి బలాన్ని చేకూరుస్తోంది.
