
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అప్పట్లో వారాహి యాత్ర ప్రారంభిస్తే అదొక సంచలనంగా మారింది. అయితే అప్పుడు వారాహి అనేది ఏంటనేది ఎవరూ ఆలోచించలేదు. ఇప్పుడు పవన్ ఏకంగా వారాహి మాత అమ్మవారి దీక్షను చేపట్టబోతుండటంతో ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వారాహి మాత అంటే ఎవరు? ఆ దీక్ష ఎలా చేపడుతారనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ దీక్షను 11 రోజుల పాటు నిర్వహించబోతున్నట్టు పవన్ తెలిపారు. ఈ 11 రోజుల పాటు కేవలం ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకుంటారు.
అసలు వారాహి మాత ఎవరంటే.. సప్తమాతృకలలో ఒకరు. లలితా పరమేశ్వరి సర్వ సైన్యాధ్యక్షురాలిగా వారాహి మాతను పేర్కొంటారు. అమ్మవారిని మహాలక్ష్మి ప్రతిరూపంగానూ.. సర్వ మంగళ స్వరూపంగానూ భావిస్తూ ఉంటారు. ఇక ఈ అమ్మవారు దుష్ట శిక్షణ కోసం ఆయుధాలు ధరించి చూడటానికి ఉగ్రరూపంగా కనిపిస్తుంది. కానీ అమ్మవారు చాలా కరుణామయి. ఈ అమ్మవారిని కొలిస్తే చాలు.. మనో అభీష్టాలను తప్పక నెరవేరుస్తుందట. జూన్ నెలాఖరున అమ్మవారి గుప్త నవరాత్రులు ప్రారంభమవుతాయి. జూలై 9న ఇవి ముగుస్తాయి. ఆషాఢమాస గుప్త నవరాత్రులను మరింత శక్తిమంతమైనవిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ నవరాత్రులు అత్యంత భక్తిశ్రద్ధలతో దీక్ష ఆచరిస్తే వారి సమస్యలన్నీ నెరవేరుతాయట.
