
హిందూ గ్రంథాలలో ఇప్పటికీ సజీవంగా ఉన్న పాత్రలలో కాకభూషుండి ఒకరు. కాకభూషుండి ఎవరంటారా? కాకి రూపంలో కనిపించే ఒక ముని. ఆయనకు రామభక్తి చాలా ఎక్కువ. శ్రీరాముడి ఆరాధనలో కాలం గడిపేవాడు. కాక భూషుండికి సంబంధించిన ప్రస్తావన గరుడ పురాణం నుంచి రామచరిత మానస్ వరకూ అన్నింటిలోనూ ఉంటుంది. కాక భూషుండి రామాయణం, మహాభారతాలకు సాక్షిగా కాకభూషుండిని పేర్కొంటారు. కాలం, మరణం, యుగాలకు అతీతమైన అమర ఋషిగా కాకభూషుండిని చెబుతారు. ఆయన కథ చాలా అద్భుతంగా ఉంటుంది.
గరుడ పురాణం.. కాకభూషుండిని అద్వైత వేదాంతం, బ్రహ్మ జ్ఞాన సమేతుడైన గొప్ప రుషిగా పేర్కొంటుంది. కాలం, మరణం వంటి వాటికి ఆయన అతీతుడు. కాబట్టే ఆయనకు అంతటి దైవిక శక్తి అని పురాణాలు చెబుతున్నాయి. కాక భూషుండి కేవలం పురాణ గ్రంధాల్లోని పాత్ర కాదు.. ప్రతి యుగానికి సాక్షి. రామాయణం, మహాభారతం, కలియుగంలోని ప్రవచనాలను సైతం విన్నాడని ప్రతీతి. కాకభూషుండి ఒక మహర్షి శాపం కారణంగా తన జీవితమంతా కాకిలా గడపాల్సి వచ్చిందని చెబుతారు. ఈయన గరుత్మంతుడికి గురువు అని తులసీదాస్ తన రామచరితమానస్లో పేర్కొన్నారు.
