
రాముడిలా విష్ణు మూర్తి అవతారం ఎత్తుతాడని రావణుడికి ముందే తెలుసా? అంటే తెలియదనే వాల్మీకి శ్రీరామాయణం చదివితే తెలుస్తుంది. రావణుడి గురించిన గొప్ప విషయాలు చెప్పాలంటే కాస్త భయం వేస్తుంది. ప్రతీ వారి చరిత్ర ఇతిహాసం కాదు. అదీ ఆచరణకి, అనుసరణకి అంత యోగ్యం కాదు. కానీ రామాయణమే అన్ని కోట్ల సార్లు పారాయణ చేయబడింది. రావణుడి గొప్పదనం చెప్పాలంటే భయం ఎందుకంటే ఆయనని అనుసరించాలని అనుకుంటారేమో అని! అంతటి గొప్పవాడు ఎందుకు పతనమయ్యాడో తెలుసుకుని మనం ఆ తప్పు చేయకుండా ఉండడానికి తెలుసుకోవచ్చు.
రావణాసురుడి జీవుడు వైకుంఠ వాసి ఎంత గొప్పవాడు కాకపోతే అక్కడి దాకా వెళ్ళాడు. చిన్న తప్పుకి బ్రహ్మ ఙ్ఞానులను గుర్తించలేక ఇబ్బంది పడ్డారు. శాపం పొందారు. మూడు జన్మల వైరం తరువాత నిన్ను చేరిపోవాలి అని అడిగారు. ఆ లెక్కన ఆయన జీవుడికి తెలుసు (సామవేదం వారు చెబుతారిలా) కానీ రావణుడికి తెలియదు. మన లోని జీవుడికీ తెలుసు ఎప్పటికైనా అక్కడికి చేరాలని లోపలున్న రాముణ్ణి అనుభూతి చెందాలని. అందుకనే రాముడి గురించి విన్నా రామనామం చెప్పినా పరవశం కలుగుతుంది. అది మనలోని జీవుడి భావన!
ఆభావనని జన్మజన్మాంతరంగా మనం సంపాదించుకున్న వాసనలు, అరిషడ్వర్గాలు, రాగద్వేషాలు, అహంకార మమకారాలూ, అవిద్య పొరలుగా మారి చుట్టూ రాళ్లతో దుర్గం(కోట) ఏర్పడిపోతుంది. ఈ దుర్గాన్ని ఛేదించడం మన వల్లకాదు! రామనామం, రామాయణ పఠనం, శ్రవణం అందుకు అంటే దుర్గం ఛేదనానికి ఉపకరిస్తాయి.
ఎప్పుడు అది జరుగుతుందో అపుడు రాముడు అనుభూతిలోకి వచ్చి జన్మపరంపర ఆగిపోతుంది. కోట్ల జన్మలు! కానీ.. అది జరిగి తీరుతుంది! అంతదాకా… రామనామము రామనామము రమ్యమైనది రామనామము.
