హిందువులంతా తొలి పూజ విఘ్నేశ్వరుడికే చేస్తారు. అలాగే ఏ శుభకార్యం లేదంటే వేరే ఏదైనా పనిని ప్రారంభించాలన్నా ముందుగా వినాయకుడికే తొలి పూజ చేస్తాం. వినాయకుని పూజించకుండా చేసిన ఏ పనులు విజయవంతం కావని హిందువులంతా నమ్ముతారు. మన దేశంలో ప్రతి గ్రామంలోనూ గణపతి ఆలయం తప్పనిసరిగా ఉంటుంది. అంతేకాకుండా ప్రతి ఆలయం వెనుక ఒక అద్భుతమైన చరిత్ర కూడా ఉంటుంది. అలాంటి అద్భుత ఆలయమే కాకుండా.. అరుదైన ఓ గణపతి ఆలయం గురించి తెలుసుకుందాం. ఇంతకూ ఈ అరుదైన గణపతి ఆలయం ఎక్కడుంది? దాని విశేషాలేంటో తెలుసుకుందాం.

తమిళనాడు రాష్ట్రం, తిరునల్వేలి జిల్లాలో కుర్తాళంలో చిత్రావతి జలపాతం ఉంటుంది. అక్కడ వెలిసిన గణపతిని నాడీ గణపతిగా పిలుస్తారు. ఈ ఆలయాన్ని బ్రిటీష్ వారి కాలంలో నిర్మించారు. ఈ గణపతి ఆలయంలో మూలవరుల విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేస్తున్న సమయంలో అప్పటి గవర్నర్ ఆలయానికి వచ్చాడట. రాతికి ప్రాణం ఉంటుందా? అని అవహేళన చేశాడట. ఆ సమయంలో అక్కడే ఉన్న ఒక సిద్ధ యోగి ఈ విగ్రహానికి ప్రాణం ఉందన్న విషయాన్ని రుజువు చేశాడట. దీంతో ఆ గవర్నర్ స్వయంగా వచ్చి స్వామివారికి నమస్కరించాడని చెబుతారు. ఇక్కడ మౌన స్వామి మఠం, కుర్తాల పీఠం, గణపతి ఆలయం వంటివి కూడా ఉన్నాయి.
