
శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు పెద్ద ఎత్తున తిరుమల తిరుపతి దేవస్థానం పటిష్ట ఏర్పాట్లు చేపట్టింది. బ్రహ్మోత్సవాల్లో తొమ్మిది రోజుల పాటు భక్తులకు అన్నదానం, ఆకర్షణీయంగా విద్యుత్ అలంకరణలు, పుష్పాలంకరణలు, క్షేత్ర మహిమను తెలిపేలా ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటుచేశారు. ఎస్వీ మ్యూజిక్ కళాశాల, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో స్వామివారి ఆలయ ప్రాంగణంలో ధార్మిక ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారి బ్రహ్మోత్సవాలను జయప్రదం చేయాలని టిటిడి కోరుతోంది.
అనంతరం ఉదయం 9.30 నుండి 11.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకం చేపట్టారు. సాయంత్రం 5.30 నుండి రాత్రి 6.30 గంటల వరకు ఊంజల్సేవ ఘనంగా జరిగింది.
భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్న పుష్పాలంకరణలు..
బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు, విద్యుత్ దీపాలంకరణలు రూపొందించారు. భక్తులకు వేసవిలో ఇబ్బంది లేకుండా చలువ పందిళ్లు, తాగునీరు, మజ్జిగ, అన్నప్రసాదాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రథమ చికిత్స కేంద్రం, ఆయుర్వేద వైద్యశాల తదితర కేంద్రాలను ఏర్పాటు చేశారు.
