శ్రీవారి మెట్టు మార్గంలో మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం

తిరుమల శ్రీవారి దర్శనార్ధం కాలినడకన వచ్చే భక్తులకు శ్రీవారి మెట్టు మార్గంలో మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్రీ జె. శ్యామలరావు తెలిపారు. కాలినడకన వెళ్లే మార్గంలో టోకెన్లు పొందేందుకు భక్తులు అసౌకర్యానికి గురౌతున్నట్లు తెలియడంతో టిటిడి అదనపు శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, టీటీడీ జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మంలతో కలిసి ఆయన మంగళవారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ శ్రీవారి మెట్టు మార్గంలో టోకెన్లు పొందడానికి భక్తులు ఇబ్బందులు పడుతున్నారని, ఆటోవాలాల నుండి సరైన సహకారం లేదని తమ దృష్టికి వచ్చిందన్నారు.

టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలను ఆటోవాలాలు స్వప్రయోజనాలకు వాడుకుంటున్నట్లు, భక్తుల నుండి విచ్చలవిడిగా ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు శాశ్వత పరిష్కార మార్గం దిశగా చర్యలు తీసుకుంటామని ఈవో తెలిపారు. భక్తులకు టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలను సమీక్షించుకుని, మరింత మెరుగైన పటిష్టమైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. తిరుపతి నుంచి శ్రీవారి మెట్టు మార్గం వరకు బస్సుల సంఖ్య పెంచడాన్ని మరియు టోకన్ల జారీ కౌంటర్లను పెంచే అంశాలను పరిశీలిస్తామన్నారు. భక్తుల నుండి ఫీడ్ బ్యాక్ సేకరించి పటిష్ట సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీఈ శ్రీ సత్యనారాయణ, ఎస్‌ఈలు శ్రీ వేంకటేశ్వర్లు, మనోహరం, టీటీడీ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం ఇతర అధికారులు పాల్గొన్నారు.

Share this post with your friends