టీటీడీ అనుబంధ ఆలయాల్లో ఘనంగా ఉగాది వేడుకలు

టీటీడీ స్థానిక ఆలయాల్లో ఆదివారం శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీకోదండరామాలయంలో, శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయాల్లో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో :

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా పాలు, పెరుగు, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు అమ్మవారు పుష్పపల్లకీలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు.రాత్రి 8 నుంచి 8.30 గంటల వరకు పంచాంగ శ్రవణం నిర్వహించారు.

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో..

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల, కొలువు నిర్వహించారు. సాయంత్రం 4.30 నుండి 6 గంట‌ల వ‌ర‌కు పంచాంగ శ్రవణం, ఉగాది ఆస్థానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏ ఈ ఓ శ్రీ ముని కృష్ణారెడ్డి, సూపరింటెండెంట్‌ శ్రీ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

శ్రీ కోదండరామాలయంలో..

తిరుపతి శ్రీ కోదండరామాలయంలో మ‌ధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉగాది ఆస్థానం, పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ సందర్భంగా జీయర్‌ స్వామివారు మూలవర్లకు, ఉత్సవర్లకు వస్త్రసమర్పణ చేశారు.

శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో..

శ్రీనివాస‌మంగాపురం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో ఉద‌యం 9.15 నుండి 10.30 గంటల వరకు ఉగాది ఆస్థానం, పంచాంగ శ్రవణం నిర్వహించారు.

శ్రీ ప్రసన్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయంలో..

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయంలో ఉదయం తొమ్మిది నుండి పది గంటల వరకు పంచాంగ శ్రవణం ఉగాది ఆస్థానం నిర్వహించారు.

నారాయణవనం శ్రీ కళ్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయంలో..

నారాయణవనం శ్రీ కళ్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయంలో సాయంత్రం 5.30 గంటలకు ఉగాది ఆస్థానం, పంచాంగ శ్రవణం శాస్త్రక్తంగా నిర్వహించారు.

కార్వేటినగరంలోని శ్రీవేణుగోపాలస్వామివారి ఆలయంలో..

కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో ఉదయం 4 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన నిర్వహించారు. సాయంత్రం 4 నుండి 5.30 గంటల వరకు ఆలయంలో ఉగాది ఆస్థానం, పంచాంగ శ్రవణం జరిగింది. అనంతరం సాయంత్రం 5.30 గంటలకు స్వామి అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ సురేష్ కుమార్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

Share this post with your friends