తిరుమలలో మహాపచారం జరుగుతోందని.. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న గోశాలలో అత్యంత దయనీయ స్థితిలో ఆవులు మృతి చెందుతున్నాయంటూ వార్తలొచ్చాయి. అంతేకాకుండా గత మూడు నెలల వ్యవధిలో 100కి పైగా ఆవులు మృతి చెందాయంటూ ఆరోపణలు వినవచ్చాయి. ఈ విషయమై అటు కూటమి ప్రభుత్వంతో పాటు.. టీటీడీపై కూడా తీవ్రమైన విమర్శలను వైసీపీ నేతలు చేశారు. శ్రీవేంకటేశ్వర స్వామి వారికి అత్యంత ప్రియమైన గోవుల సంరక్షణను కూటమి ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆరోపించారు టీటీడీ పూర్తి నిర్లక్ష్యమే ఇందుకు కారణమని.. తక్షణమే గోవుల్ని రక్షించాలని డిమాండ్ చేశారు.
ఈ వ్యవహారంపై తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించింది. టీటీడీ గోశాలలో ఇటీవల గోవులు మృతి చెందాయంటూ కొద్దిమంది సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం వాస్తవం కాదని తేల్చి చెప్పింది. అసలు మృతి చెందాయంటూ బయటకు వచ్చిన గోవుల పోటోలు టీటీడీ గోశాలకు సంబంధించినవి కావని స్పష్టం చేసింది. దురుద్దేశంతో కొంత మంది మృతి చెందిన గోవులు పోటోలను టీటీడీ గోశాలలో మృతి చెందినవిగా చూపించి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చేస్తున్న ప్రచారాన్ని టీటీడీ ఖండిస్తోంది. ఇలాంటి అవాస్తవ ప్రచారాన్ని నమ్మవద్దని టీటీడీ కోరింది.