
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. వేసవి సెలవుల కారణంటా తిరుమలలో విపరీతంగా భక్తుల రద్దీ పెరిగిపోయింది. ఈ క్రమంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. టీటీడీ ఈఓ శ్రీ జె.శ్యామలారావు తిరుమలలోని సహజ శిలా తోరణం, చక్ర తీర్థాన్ని శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. తన తనిఖీలో భాగంగా ఈ ప్రాంతాలలో పార్కింగ్, శుభ్రత, మొదలైన అంశాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.
అనంతరం ఆయన చక్ర తీర్థం రాతి కొండలో చెక్కి ఉన్న శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్, నరసింహ స్వామి, ఆంజనేయ స్వామి ప్రతిమలను, అక్కడే ఉన్న శ్రీ శివుని సాన్నిధ్యాన్ని కూడా పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయా ప్రాంగణాల్లో పరిశుభ్రత మెరుగుపరచాలని ఆయన సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్య శాఖ డిప్యూటీ ఈఓ శ్రీ సోమన్ నారాయణ, ఆరోగ్య అధికారి డాక్టర్ మధుసూధన్, టీటీడీ అటవీ శాఖ సిబ్బంది, ఇతరులు కూడా టీటీడీ ఈవో వెంట ఉన్నారు.
