శ్రీవారి దర్శనార్థం భక్తులు వేచి ఉండే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ శ్రీ బీఆర్.నాయుడు శనివారం రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వీకెండ్ కావడంతో పాటు వరుస సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో నారాయణగిరి షెడ్లు, క్యూలైన్లు, కంపార్ట్ మెంట్లలో భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం అక్షయ కిచెన్ ను తనిఖీ చేసి భక్తుల కోసం తయారు చేస్తున్న అన్న ప్రసాదాలను రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఎలాంటి జాప్యం లేకుండా భక్తులకు ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు నిరంతరాయంగా పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా భక్తులతో మాట్లాడుతూ అధిక రద్దీ కారణంగా దర్శనం కోసం వేచి ఉండే సమయం పెరుగుతుండటంతో ఎలాంటి ఆందోళన చెందకుండా టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకుని సంయమనంతో శ్రీవారిని దర్శించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ నరేష్ కుమార్, హెల్త్ ఆఫీసర్ శ్రీ మధుసూదన్, ఏఈవో శ్రీ శ్రీనివాసులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.