ఇవాళ ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్పణ

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి శ్రీరామనవమి బ్ర‌హ్మోత్స‌వాలు ఏప్రిల్ 6 నుండి 14వ తేదీ వరకు వైభ‌వంగా జ‌రుగ‌నున్నాయి. ఏప్రిల్ 5న సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వ‌హించ‌నున్నారు. శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలకు విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఆలయంలో ప్రత్యేక క్యూలైన్లు, ఎండవేడిని తట్టుకునేలా చలువపందిళ్లు ఏర్పాటుచేశారు. ఆలయ పరిసరాల్లో బారీకేడ్లు ఏర్పాటుచేశారు. ఆలయ గోపురాలు, కల్యాణవేదిక, ఇతర ప్రాంతాల్లో పుష్పాలంకరణలు, రంగురంగుల విద్యుత్‌ దీపాలు, విద్యుత్‌ కటౌట్లతో శోభాయమానంగా అలంకరించారు. భక్తుల కోసం అన్నప్రసాద వితరణ కౌంటర్లు తదితర ఏర్పాట్లు చేశారు.

6న ధ్వ‌జారోహ‌ణము

ఏప్రిల్ 6న ధ్వజారోహణంతో శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 నుండి 10.15 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం, రాత్రి 7 నుండి 9 గంటల వరకు శేష వాహనసేవ జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 6న శ్రీ రామనవమి, ఏప్రిల్ 9న హనుమత్సేవ, ఏప్రిల్ 10న గరుడసేవ జరగనున్నాయి. ఏప్రిల్ 11న సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వ‌ర‌కు శ్రీ సీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా జరుగనుంది. అనంతరం గజ వాహనసేవ నిర్వహిస్తారు. ఏప్రిల్ 12న రథోత్సవం నిర్వహిస్తారు. ఏప్రిల్ 14న ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఏప్రిల్ 15న సాయంత్రం 5.30 నుండి రాత్రి 9 గంటల వరకు పుష్పయాగం వైభవంగా నిర్వహిస్తారు. ప్రతిరోజూ ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.

Share this post with your friends