నేడు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి జయంతిని హిందువులంతా అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే అమ్మవారి గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. స్త్రీలోని ఆత్మీయతకు, అనురాగానికి, సౌమ్యానికి , త్యాగగుణానికి , పవిత్రతకు నిలువెత్తు నిదర్శనం ‘వాసవీ కన్యకా పరమేశ్వరి’ సంపూర్ణ శ్రీపాద శ్రీ వల్లభ చరితామృత గ్రంధ ఆధారంగా వాసవి కన్యకాంబ శ్రీపాద శ్రీ వల్లభుల సహోదరి. 10వ , 11వ శతాబ్ధానికి చెందిన కుసుమశ్రేష్ఠి – కుసుమాంబ (కౌసుంబి) దంపతుల గారాల బిడ్డ , పుణ్యాల పంట వాసవాంబ. కుసుమ శ్రేష్ఠి వేంగి దేశంలోని ‘వసాల్’ ప్రాంతాన్ని పాలించేవాడు.
కుసుమ శ్రేష్ఠిని ఆ రోజులలో అంతా పెద్ద శ్రేష్ఠి (ఈ శ్రేష్ఠి పదం కాల క్రమేణా శెట్టి గా రూపాంతరం చెందింది) అని పిలిచే వారు. ప్రజలంతా ఎంతగానో గౌరవించేవారు. ‘వసాల్’ దేశంలో పుట్టింది కనుక ఆమె ‘వాసవి’ అయింది. కన్యారాశిలో పుట్టింది కనుక ‘కన్యక’ అయింది. వాసవి అమ్మను పూజించే వారిని శ్రేష్ఠులు అంటారు. ఈ పదమే వ్యవహారంలో శెట్టి అయింది. ఈ శ్రేష్ఠులు గోదావరి పరీవాహక ప్రాంతంలో ఉండి గోవును పూజించేవారు. గోదావరిని స్థానికులు గోమతి అని పిలుస్తారు అదేవిధంగా గోమాతను కుడా ‘గోమతి అని స్థానికంగా వ్యవహరిస్తారు.’ఈ పేరే ‘గోమ్టి’గా మారింది. గోవును పూజించే గోమతి తీర వాసులు కనుక వీరిని ‘గోమట్లు’ అని పిలిచేవారు. ఈ పేరే వ్యవహారంలో ‘కోమట్లు’గా మారింది.