శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో బుధవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో అక్టోబరు 31వ తేదీ దీపావళి ఆస్థానం సందర్భంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 7 నుండి 10 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా ఆలయాన్ని శుద్ధి చేసి, పసుపు, కుంకుమ, చందనం, సీకాయ, నామం, కర్పూరం, కిచిలిగడ్డ, కస్తూరి పసుపు, పచ్చాకు తదితరాలతో తయారు చేసిన సుగంధ ద్రవ్యాన్ని గర్భాలయ గోడలకు పూశారు.

అనంతరం ఉదయం 11 గంటల నుండి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమ‌తి నాగరత్న, వీజీవో శ్రీమతి సదాలక్ష్మీ, ఏఈవో శ్రీ రవి, సూపరింటెండెంట్‌ శ్రీ సోమ శేఖర్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

పరదాలు విరాళం

తిరుపతికి చెందిన శ్రీ మణి అనే భక్తుడు శ్రీ కోదండరామ స్వామి ఆలయానికి రెండు పరదాలు, ఒక కురాళం విరాళంగా అందించారు.

ఇవాళ దీపావళి ఆస్థానం

శ్రీ కోదండరామాలయంలో దీపావళి సందర్భంగా ఇవాళ (గురువారం) రాత్రి 7 గంటలకు తిరుపతి శ్రీగోవిందరాజస్వామివారి ఆలయం నుండి నూతన వస్త్రాలు, దోశపడి, దీపాలు తీసుకువచ్చి శ్రీకోదండరామస్వామివారికి సమర్పిస్తారు. అనంతరం ఆలయంలో దీపావళి ఆస్థానం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అమావాస్యనాడు ఆలయంలో నిర్వహించే సహస్ర కలశాభిషేకం, హనుమంత వాహనసేవల‌ను టీటీడీ రద్దు చేసింది.

Share this post with your friends