దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మే 10 నుంచి అత్యంత వైభవంగా స్వామివారి తెప్పోత్సవాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ తెప్పోత్సవాల కోసం ఆలయ అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. తెప్పలపై విహరించనున్న స్వామి, అమ్మవార్ల కోసం తెప్పను అందంగా.. శోభాయమానంగా అలంకరించనున్నారు. ఈ తెప్పోత్సవాలు మూడు రోజుల పాటు అంటే మే 12వ తేదీ వరకు జరుగనున్నాయి. స్వామి, అమ్మవార్లు ఆలయ పుష్కరిణిలో ప్రతి రోజు సాయంత్రం 6 గంటలకు తెప్పలపై విహరించి భక్తులను కటాక్షించనున్నారు.
ఇందులో భాగంగా మే 10న శ్రీ కృష్ణ సమేత గోదాదేవి మూడు చుట్లు, మే 11న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారు ఐదు చుట్లు, మే 12న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారు ఏడు చుట్లు తెప్పలపై తిరిగి కనువిందు చేయనున్నారు. ఈ మూడు రోజుల పాటు ఉదయం 10 నుండి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు తిరువీధి ఉత్సవం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.