జనకపురిని తలపించిన కళ్యాణ వేదిక కళాకృతులు.. వరి గింజలతో మండపం

ఒంటిమిట్టలో జ‌రుగుతున్న శ్రీ సీతారాముల కల్యాణం కోసం తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో తెలుగు సంప్ర‌దాయం ఉట్టిప‌డేలా త్రేతాయుగంనాటి జనకపురిని గుర్తుకు తెచ్చేలా క‌ల్యాణ‌వేదిక‌ను అందంగా తీర్చిదిద్దారు. వేదిక రంగురంగుల పుష్పాలతో చూపరులకు ఆహ్లాదాన్ని పంచుతోంది. వేదికపై, ప్రాచీన ఆలయాలలోని కళాకృతులు, దశావతారాల సెట్టింగు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సీతారాముల కల్యాణాన్ని వీక్షించేందుకు వచ్చిన భక్తులు పుష్పాల అలంకరణ చూసి ముగ్ధులయ్యారు.

ప్రత్యేకంగా వరి గింజలతో మండపం ఏర్పాటు, చెరుకులు, టెంకాయ గెలలు, టెంకాయపూత, అరటి ఆకులు, మామిడాకులు, హెలికానియమ్స్, టార్చ్ జింజర్, నీలం ఆర్కిడ్‌, రెడ్‌ ఆంథూరియం తదితర విదేశీ జాతుల పుష్పాలతో కల్యాణవేదికను అలంకరించారు. ఇందుకోసం 4 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 60 వేల కట్‌ ఫ్లవర్స్‌ వినియోగించారు. టీటీడీ ఉద్యానవన విభాగం సూపరింటెండెంట్‌ శ్రీ శ్రీనివాసులు పర్యవేక్షణలో రెండు రోజులపాటు 120 మంది అలంకరణ నిపుణులు, 120 మంది టీటీడీ సిబ్బంది ఇందుకోసం పనిచేశారు.

Share this post with your friends