3న‌ హరిద్రా ఘటనంతో ఒంటిమిట్ట శ్రీరాముని కల్యాణ మహోత్సవాలు ప్రారంభం

ఒంటిమిట్ట శ్రీ సీతా రాముల కల్యాణ మహోత్సవాలు ఏప్రిల్ 3న‌ ”హరిధ్రా ఘటనం”తో అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా గురువారం ఉద‌యం గర్భాలయం లోపల పసుపు కొమ్ములకు, రోళ్ళు, రోకళ్లకు స్వామి పాదాల చెంత ప్రత్యేక పూజలు నిర్వ‌హిస్తారు. అనంత‌రం పెద్ద సంఖ్య‌లో మహిళా భక్తులు పాల్గొని పసుపు కొమ్ములను పోసి సాంప్రదాయ బద్దంగా రోలులో దంచ‌నున్నారు. తద్వారా శ్రీ సీతా రామ కల్యాణ మహోత్సవ ఏర్పాట్లు ప్రారంభ‌మ‌వుతాయి.

పసుపు దంచే కార్యక్రమంలో వచ్చిన పసుపును ఉత్సవరులకు శ్రీ సీతారాముల‌ కల్యాణ మహోత్సవంలో తలంబ్రాల తయారీకి ఉపయోగిస్తారు. శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంలో భాగంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. వేసవి కావడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందీ తలెత్తకుండా చలువ పందిళ్లు వేస్తున్నారు. భక్తులకు అవసరమైన మౌళిక సదుపాయాలన్నీ కల్పిస్తున్నారు. మంచినీటి సౌకర్యంతో పాటు వైద్య పరమైన అత్యవసర సేవలను సైతం నిర్వహిస్తున్నారు.

Share this post with your friends