
తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం, సాయంత్రం వాహన సేవలో శ్రీ గోవిందరాజ స్వామి భక్తులను కటాక్షిస్తున్నారు. రెండో రోజైన మంగళవారం రాత్రి స్వామివారు సరస్వతి దేవి అలంకారంలో హంస వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటలకు వాహన సేవ ప్రారంభమైంది.వాహనం ముందు వృషభాలు, అశ్వాలు, గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది.
రాత్రి 7.00 గంటల నుండి 9.00గంటల వరకు హంస వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆత్మానాత్మ వివేకం కలవానికి భగవదనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. హంస వాహనంలోని పరమార్థం ఇదే. హంసలో పాలను, నీళ్లను వేరుచేసే సామర్థ్యం ఉంది. ‘సో హం’ భావం కలిగిన భక్తులలో అహంభావం తొలగించి ‘దాసోహం’ అనే భావం కలిగించడానికే పరమహంస రూపానికి ప్రతీక అయిన హంసవాహనాన్ని స్వామివారు అధిరోహిస్తారు.
