శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన శనివారం రాత్రి విశేషమైన గరుడ వాహనసేవ రాత్రి 7 గంటల నుండి అత్యంత వైభవంగా జరిగింది. స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, కేరళ కళాకారులవాయిద్యాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. గరుడ వాహనంపై ఉన్న శ్రీవారిని దర్శిస్తే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. వాహనసేవలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి దంపతులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులు, జేఈవో శ్రీ వీరబ్రహ్మం దంపతులు, ఆలయ ప్రత్యేకాధికారి మరియు సిపిఆర్వో డా.టి.రవి, ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపినాథ్, వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ మోహన రంగాచార్యులు, సూపరింటెండెంట్ శ్రీ రాజ్కుమార్, ఆలయ అర్చకులు శ్రీ బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ మునికుమార్, శ్రీ ధన శేఖర్, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.