
దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామివారి ఆలయంలో సోమవారం సాయంత్రం బాలాలయ సంప్రోక్షణకు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు.
ఇందులో భాగంగా సాయంత్రం 5.30 గంటలకు ఆలయంలో ఏర్పాటు చేసిన యాగశాలలో శాస్త్రోక్తంగా అంకురార్పణ, బాల బింబాలకు జలాభిషేకం నిర్వహించారు. కాగా, ఆగస్టు 19న ఉదయం 8 గంటలకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, శాంతి హోమం, వాస్తు హోమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.
అనంతరం సాయంత్రం 5.30 గంటలకు కళాకర్షణ నిర్వహించారు. దీనిలో భాగంగా గర్భాలయంలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి మూలమూర్తి శక్తిని కుంభంలోకి ఆవాహన చేసి యాగశాలలో ప్రతిష్టించి ఆరాధనలు చేపట్టారు. ఇక ఇవాళ (ఆగస్టు 20వ తేదీన) ఉదయం 9.30 గంటలకు మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఉదయం 10 నుంచి 11.15 గంటల మధ్య తులా లగ్నంలో బాల బింబ ప్రతిష్ట, బాలాలయ సంప్రోక్షణ నిర్వహించారు.
