హిందువులంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న కేదార్నాథ్ యాత్ర ప్రారంభమైంది. ఈ ఉదయం 7 గంటల 10 నిమిషాలకు కేదార్నాథ్ ఆలయాన్ని తెరిచి సుందరంగా ముస్తాబు చేశారు. 13వందల కిలోల బంతిపూలతో కేదారనాథుడి ఆలయాన్ని.. ఆలయ ప్రాంగణాన్ని అందంగా, శోభాయమానంగా అలంకరించారు. ఇప్పటికే కేదార్నాథ్ ఆలయానికి భక్తులు పెద్దఎత్తున చేరుకుని స్వామివారిని సందర్శించుకుంటున్నారు. ఆలయ తలుపులు తెరిచిన వెంటనే దర్శనాలు సైతం ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా భక్తులు నిర్వహించే చార్ధామ్ యాత్రలో కేదార్నాథ్ కూడా భాగమే.
కేదార్నాథుడిని దర్శించుకునేందుకు కొన్ని నెలల పాటు భక్తులు ఆశగా ఎదురు చూస్తుంటారు. ఆలయ తలుపులు తెరిచిన నాటి నుంచి దేశ విదేశాల నుంచి భక్తులు కేదార్నాథ్కు చేరుకుంటారు. అయితే పహల్గాం దాడి నేపథ్యంలో ఇక్కడ కూడా అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరుగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మందాకిని నది ఒడ్డున సముద్ర మట్టానికి 3583 మీటర్ల ఎత్తులో కేదార్నాథ్ ఆలయం ఉంటుంది. ఈ ఆలయం ఆరు నెలల పాటు మంచుతో కప్పబడి ఉండటంతో ఆ సమయం అంతా కేదార్నాథ్ తలుపులు మూసే ఉండాలి. కేవలం వేసవి కాలంలో మాత్రమే తెరుస్తారు.