ఒంటిమిట్ట / తిరుపతి, 2025 ఏప్రిల్ 06: ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సంపూర్ణ రామాయణం సెట్టింగ్ భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఇందులో రామాయణంలోని వివిధ ఘట్టాలను తెలియజేసే ప్రతి ఒక్క ఘట్టానికి సంబంధించిన సెట్టింగ్నూ ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులను ఉయ్యాలలో పవళింపజేస్తున్న దశరధుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయిల సెట్టింగ్ విపరీతంగా ఆకట్టుకుంది.
విశ్వామిత్ర మహర్షి యజ్ఞ రక్షణార్థం మారీచా, సుబాహు అనే రాక్షసులను సంహరిస్తున్న శ్రీరామ లక్ష్మణులు, జనక మహారాజు సభ యందు శివధనస్సు విరుస్తున్న శ్రీరామచంద్రుడు, సీతారామ కళ్యాణ వైభోగం సెట్టింగులు ఆకట్టుకున్నాయి. అదేవిధంగా సీతమ్మను అపహరిస్తున్న రావణాసురుడు, లంకకు వారధి కడుతున్న వానరసైన్యం, వనవాస కాలమున సూర్పనఖ అనే రాక్షసి ముక్కు చెవులను కోస్తున్న లక్ష్మణుడు, శ్రీరామ పట్టాభిషేకం తదితర కళాఖండాలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. అదేవిధంగా ఆలయం లోపల, బయట వివిధ రకాల సాంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్ తో భక్తులను ఆకట్టుకునేలా వినూత్నంగా అలంకరణలు చేశారు.