ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ కోదండరామ స్వామివారి బ్రహ్మోత్సవాలు

తిరుపతి శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం, సాయంత్రం వాహన సేవలతో పెద్ద ఎత్తున పట్టాభిరాముడు భక్తులకు అభయమిచ్చాడు. పెద్ద ఎత్తున భక్తులు తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలకు హాజరై స్వామివారికి వివిధ రకాల పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు సైతం భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీంతో తొమ్మిది రోజుల పాటు ఆలయానికి భక్తులు పోటెత్తి స్వామివారి వాహన సేవల్లో పాల్గొని కర్పూర నీరాజనాలు సమర్పించారు.

ఇంత అంగరంగ వైభవంగా జరిగిన బ్రహ్మోత్సవాలు శుక్రవారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. రాత్రి 8.30 గంటలకు ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు. గరుడ పటాన్ని అవతనం చేశారు. బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకునే వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారని ఐతిహ్యం. విషమృత్యు నాశనం, రాజ్యపదవులవంటి సకల శ్రేయస్సులు పొందుతారని విశ్వాసం. అందుకే సామాన్యుల నుంచి ప్రముఖుల వరకూ ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీ నాగరత్న, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ సురేష్ పాల్గొన్నారు.

Share this post with your friends