అయోధ్య రామయ్యకు సూర్యతిలకం.. పూల హోలీ

అయోధ్యలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు అత్యంత వేడుకగా జరిగాయి. ముందుగా రామ్ లల్లాకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి ఆపై అందంగా అలంకరించారు. అయోధ్య రామయ్యను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. శ్రీరామ నామస్మరణతో ఆలయం మారుమోగింది. భక్తుల జయజయ ధ్వానాల నడుమ శ్రీరాముడికి అర్చకులు సూర్యతిలకం దిద్దారు. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు సూర్య తిలక ఘట్టం కనువిందు చేసింది. గత ఏడాది సైతం ఇదే మాదిరిగా స్వామివారికి సూర్యతిలకం దిద్దారు. ఇక సాయంత్రం సరయూ నది దివ్య దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.

శ్రీరామ నవమి సందర్భంగా అయోధ్య ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులంతా కలిసి చౌదరి చరణ్ సింగ్ ఘాట్ వద్ద రెండున్నర లక్షల దీపాలను వెలిగించారు. అయోధ్యలో స్వామివారి ఆలయ నిర్మాణం అనంతరం ఇది రెండవ దీపోత్సవం కావడం విశేషం. ఈ క్రమంలోనే సరయూ నది వద్ద హోలీ ఆడుతూ భక్తులంతా వేడుకలు జరుపుకున్నారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సైతం శ్రీరామనవమికి ఎలాంటి లోటూ రాకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. నవమి సందర్భంగా పూల హోలీ, సాంస్కృతిక కార్యక్రమాలు, పెయింటింగ్, రంగోలి కార్యక్రమాలను నిర్వహించింది.

Share this post with your friends