తిరుమలలో భ‌ద్ర‌త‌పై రాష్ట్ర డీజీపీ, టీటీడీ ఈఓ ఉన్న‌త‌స్థాయి సమీక్ష సమావేశం

దేశంలో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తిరుమలలో భద్రతను ఏ విధంగా మరింత బలోపేతం చేయాలన్న అంశం పై ఆంధ్రప్రదేశ్ డీజీపీ శ్రీ హరిష్ కుమార్ గుప్తా, తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్రీ జె. శ్యామల రావు సమక్షంలో శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఉన్నత స్థాయి భద్రత సమావేశం జరిగింది. ఈ సమావేశం ప్రారంభంలో ముందుగా తిరుపతి ఎస్పీ, టీటీడీ ఇన్‌ఛార్జ్‌ సీవీఎస్వో శ్రీ హర్షవర్ధన్ రాజు భద్రతా అంశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో తిరుమలకు ఉన్న ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకొని మెరుగైన భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయడం అవసరమని తెలిపారు.

ఏపీఎస్పీ, డీఏఆర్‌, ఎస్పీఎఫ్‌, హోంగార్డు, సివిల్ పోలీసు, టీటీడీ సెక్యూరిటీతో పాటు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే డిజాస్టర్ మేనేజ్‌మెంట్ టీమ్ ఏర్పాటుపై దృష్టి పెట్టాలన్నారు. వివిధ సెక్యూరిటీ ఏజెన్సీలకు స్థిరమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రూపొందించాలని సూచించారు. అలిపిరి వద్ద బహుళ స్థాయి వాహన తనిఖీ వ్యవస్థ, డిఫెన్స్ ఏజెన్సీలతో కలసి సెన్సార్ ప్లే సిస్టమ్, ఆధునిక భద్రతా పరికరాలు, సైబర్ భద్రత వ్యవస్థను బలోపేతం చేయడం వంటి అంశాలపై కూడా ఆయన చ‌ర్చించారు. అనంతరం టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామల రావు మాట్లాడుతూ, భద్రతపై అనుబంధ ఏజెన్సీలతో ఒక సమన్వయ వ్యవస్థ అవసరమని అభిప్రాయ పడ్డారు. తిరుమలలో సైబర్ భద్రతా వ్యవస్థను మరింతగా బలోపేతం చేయాల‌ని పేర్కొన్నారు. విస్తృతస్థాయిలో తిరుమల భద్రతా సమీక్ష నిర్వహించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు.

Share this post with your friends