సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పకళను సంరక్షించడంతో పాటు భవిష్యత్ తరాలకు అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం విశేష కృషి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవేంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పశిక్షణ సంస్థ ఏకైక సంస్థగా పేరొందింది. భారతీయ సాంప్రదాయ ఆలయ శిల్పకళ, నిర్మాణ రంగంలో నైపుణ్యం గల వ్యక్తులను శిక్షణ ఇస్తున్న ఒక ప్రత్యేక సంస్థ. భారతీయ సంస్కృతి, వారసత్వానికి దిశా నిర్దేశకులుగా విద్యార్థులను తీర్చిదిద్దడానికి ఈ సంస్థ సహాయపడుతుంది. ఈ సంస్థ ఆలయ నిర్మాణ శిల్పకళ, వాస్తుశిల్పం, ఇతర సంబంధిత కళా రూపాలపై విద్యార్థులకు శిక్షణ ఇస్తుంది. 1960వ సంవత్సరంలో స్థాపించి శిల్పశాస్త్రాల ప్రకారం విద్యార్థులకు టీటీడీ శిక్షణ ఇస్తోంది.
ఉపాధి అవకాశాలు
ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు ఇదే సంస్థలో ఉపాధ్యాయులుగా, టీటీడీ రినోవేషన్ విభాగంలో స్థపతులుగా, టెక్నికల్ అసిస్టెంట్లుగా, కాంట్రాక్టర్లుగా అవకాశాలు పొందుతున్నారు. అంతేగాక ప్రభుత్వ శాఖలైన దేవాదాయ, ధర్మాదాయ శాఖ, పర్యాటక శాఖ, పురావస్తు పరిశోధనా శాఖల్లో పనిచేస్తూ అనేక జాతీయ సంస్థల నుండి అవార్డులు కూడా సాధిస్తున్నారు. శిల్పశిక్షణ సంస్థకు అనుబంధంగా ఉన్న శిలా శిల్ప ఉత్పత్తి విభాగంలో కొందరు విద్యార్థులు కాంట్రాక్ట్ పద్ధతిన దేవతామూర్తుల ప్రతిమలను తయారు చేస్తున్నారు.