ప్రయాగ్‌రాజ్‌లో వైభవంగా శ్రీ శ్రీనివాస కల్యాణం

మహా కుంభమేళా సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లో శ్రీవారి నమూనా ఆలయాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ప్రయాగ్‌రాజ్ సెక్టార్-19లో గల ఇస్కాన్ క్యాంపులో గురువారం శ్రీ శ్రీనివాస కల్యాణాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అంగరంగ వైభవంగా నిర్వహించింది. ఈ కల్యాణానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. ముందుగా అర్చక బృందం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ స్వామి వారి ఉత్సవర్లను కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. అనంతరం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీ వేంకటేశ్వరస్వామివారి కల్యాణం జరిగింది.

శ్రీ విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణ ధారణ, అగ్నిప్రతిష్టాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మహా సంకల్పం, మాంగళ్య పూజ, మంగళ సూత్రధారణ మొదలయిన ఘట్టాలతో శాస్త్రోక్తంగా శ్రీ స్వామి అమ్మవార్ల కల్యాణాన్ని నిర్వహించారు. చివరిగా శ్రీ స్వామి అమ్మవార్లకు నక్షత్ర హారతి, మంగళహారతి సమర్పించడంతో కల్యాణం దిగ్విజయంగా ముగిసింది. శ్రీవారు, అమ్మవార్ల కల్యాణ ఘట్టాన్ని నేత్రపర్వంగా తిలకించిన భక్తులు భక్తి పరవశంతో పులకించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీ శివప్రసాద్, హెచ్ డీపీపీ అదనపు సెక్రటరీ శ్రీ రామ్ గోపాల్, ఏఈవో శ్రీ రవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Share this post with your friends