ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో సీతారాములకు సంబంధించిన ఏ విశేషమైనా అత్యంత వైభవంగా జరుగుతుంది. ఇటీవలే ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముడి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఇక తాజాగా అంటే మంగళవారం శ్రీ సీతా జయంతి ఉత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, పరివార దేవతలకు తిరుమంజనం నిర్వహించారు. అనంతరం మూలవర్లకు వ్యాసాభిషేకం, ఆరాధన, అర్చన చేశారు.
సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఆలయంలోని రంగ మండపంలో సర్వాంగ సుందరంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై శ్రీ సీతారామ లక్ష్మణ ఉత్సవమూర్తులను వేంచేపు చేశారు. ప్రత్యేకంగా సీతమ్మవారికి “వాసంతిక పూజ” మల్లె పూలతో సహస్రనామ అర్చన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరై సీతా జయంతి వేడుకలను కన్నులారా తిలకించారు. ఇంకా ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు శ్రీ నటేష్ బాబు, శ్రీమతి ప్రశాంతి, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య తదితరులు పాల్గొన్నారు.