ఆదిశేషుని మార్గాన్ని అనుసరించిన శ్రీ రామానుజాచార్యులు

భక్తి ఉద్యమంతో సమానత్వాన్ని బోధించి సమాజాన్ని సంస్కరించిన మహనీయుడు భగవద్‌ రామానుజాచార్యులని శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్ స్వామి ఉద్ఘాటించారు. టీటీడీ ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శ్రీ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు బుధ‌వారం సాయంత్రం ఘనంగా ప్రారంభమయ్యాయి. మే 2వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ సంద‌ర్భంగా శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్ స్వామి అనుగ్ర‌హ భాష‌ణం చేస్తూ, ఆదిశేషుని అవతారమైన భగవద్‌ రామానుజులు శరణాగత భక్తిని విశేషంగా ప్రచారం చేశారని, శ‌ర‌ణాగ‌తి భ‌క్తితో భ‌గ‌వంతుని కొలిస్తే దివ్య‌త్వం క‌లుగుతుంద‌ని అన్నారు.

శ్రీమహావిష్ణువుకు ఆదిశేషుడు పాన్పుగా, ఆసనంగా ఉంటూ ప్రథమ సేవకుడిగా నిలిచాడని, భగవద్‌ రామానుజులు ఈ మార్గాన్నే అనుసరించారని వివరించారు. శ్రీ రామానుజార్యుల అవతార మహోత్సవాలను టీటీడీ ఘ‌నంగా నిర్వహిస్తోంద‌న్నారు. అనంతరం అహోబిలం మఠంకు చెందిన శ్రీ సీతారామన్ “శ్రీ రామానుజ వైభవం”పై ఉపన్యసించారు. ఆ తరువాత అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ స‌ర‌స్వ‌తి ప్ర‌సాద్‌ బృందం ఆలపించిన సంకీర్తనలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేక అధికారి శ్రీ రాజగోపాల రావు, ప్రోగ్రాం కో-ఆర్డినేట‌ర్ శ్రీ పురుషోత్తం, పురప్రజలు పాల్గొన్నారు.

Share this post with your friends