ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఆదివారం ఉదయం ధ్వజారోహణంతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 నుండి 10.15 గంటల మధ్య వృషభ లగ్నంలో పాంచరాత్ర ఆగమశాస్త్ర బద్ధంగా గరుడపటాన్ని ప్రతిష్టించి శాస్త్రోక్తంగా ధ్వజారోహణ ఘట్టం నిర్వ‌హించారు. కంకణబట్టర్‌ శ్రీ రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కంకణబట్టర్‌ శ్రీ రాజేష్ కుమార్ మాట్లాడుతూ, ముందుగా గరుడ ధ్వజపటాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి గరుడ ప్రతిష్ట, ప్రాణప్రతిష్ట, నేత్రోల్మీలనం నిర్వహించామన్నారు. ధ్వజస్తంభానికి నవకలశ పంచామృతాభిషేకం చేసినట్టు చెప్పారు. రాగతాళ నివేదన ద్వారా ఇంద్రాది సకలదేవతలను, నవగ్రహాలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించినట్టు వివరించారు.

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజైన ఆదివారం రాత్రి శేషవాహనంపై సీతాలక్ష్మణ సమేత శ్రీరాములవారు భక్తులను క‌టాక్షించారు. రాత్రి 7 గంటల నుండి భజన బృందాల కోలాటాల నడుమ పురవీధుల్లో వాహనసేవ జరిగింది. ఆదిశేషుడు స్వామివారికి మిక్కిలి సన్నిహితుడు. త్రేతాయుగంలో లక్ష్మణుడుగా, ద్వాపరయుగంలో బలరాముడుగా శేషుడు అవతరించాడు. శ్రీవైకుంఠంలోని నిత్యసూరులలో ఇతడు ఆద్యుడు. భూభారాన్ని వహించేది శేషుడే. శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం. ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం, దాని నుండి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయి.

Share this post with your friends