ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం, సాయంత్రం పెద్ద ఎత్తున స్వామివారి వాహన సేవలు నిర్వహిస్తున్నారు. ఈ వాహనసేవలకు పెద్ద ఎత్తున భక్తులు సైతం హాజరవుతున్నారు. వీరికి ఎలాంటి ఇబ్బందీ కలగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా రెండో రోజు సోమవారం ఉదయం వేణుగానాలంకారంలో స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు.
ఉదయం 7.30 గంటల నుండి స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం 11 గంటలకు ఆలయంలో స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో స్వామి, అమ్మవార్లకు అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ నటేష్ బాబు, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నవీన్, ఆలయ అర్చకులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.