శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు నేడు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ పరిణయోత్సవాలు మూడు రోజుల పాటు అంటే ఈ నెల 8వ తేదీ వరకు తిరుమలలో ఘనంగా జరుగనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన గార్డెన్ విభాగం ఆధ్వర్యంలో పరిణయోత్సవ మండపాన్ని అత్యంత సుందరంగా అలంకరించారు. నారాయణగిరి ఉద్యానవనాల్లోని పరిణయోత్సవ మండపంలో ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
మూడురోజులపాటు జరుగనున్న ఈ వేడుకలో తొలిరోజు శ్రీ మలయప్పస్వామివారు గజవాహనం, రెండవరోజు అశ్వవాహనం, చివరిరోజు గరుడవాహనంపై వేంచేపు చేస్తారు. మరోపక్కఉభయనాంచారులు ప్రత్యేక పల్లకీలలో పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. ఆ తరువాత కల్యాణమహోత్సవం కన్నుల పండుగగా నిర్వహిస్తారు. శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు సందర్భంగా మే 6 నుండి 8వ తేదీ వరకు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది.