
తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి పేట ఉత్సవానికి ఆలయ అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. కోదండరామ స్వామివారి పేట ఉత్సవాం ఫిబ్రవరి 13వ తేదీన ఘనంగా నిర్వహించనున్నారు. మాఘ మాసానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. అందునా మాఘ పౌర్ణమికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ క్రమంలోనే మాఘ పౌర్ణమి సందర్భంగా శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను కూపుచంద్రపేట గ్రామానికి ఊరేగింపుగా తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది.
ఉదయం 6 గంటలకు ఆలయం నుంచి స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులు ఊరేగింపుగా బయలుదేరి తిరుపతికి 8 కిలోమీటర్ల దూరంలో గల కూపుచంద్రపేటకు చేరుకుంటుంది. అక్కడ ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకూ శ్రీ కోదండరామ స్వామివారి స్నపనతిరుమంజనం, ఆస్థానం నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఊంజల్సేవ, సాయంత్రం 5 నుంచి బయల్దేరి రాత్రి 9 గంటల వరకు గ్రామోత్సవం, తిరిగి ఆలయానికి చేరుకుంటారు.
