
తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో కార్తీక మాసం ఆరంభం నుంచి హోమాలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా 11 రోజుల పాటు నిర్వహించిన రుద్రయాగం శుక్రవారం శాస్త్రోక్తంగా ముగిసింది. శనివారం శ్రీ కాలభైరవ హోమం ఘనంగా జరిగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో డిసెంబరు 1వ తేదీ వరకూ హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్న విషయం విదితమే.
ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పూజ, అష్టభైరవ హోమం, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాశాంతి అభిషేకం, శ్రీ కాలభైరవ మూలవర్లకు కలశాభిషేకం, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం 6 నుండి 8.30 గంటల వరకు శ్రీ చండికేశ్వరస్వామివారి కలశస్థాపన, పూజ, జపం, హోమం, విశేష దీపారాధన చేపట్టనున్నారు.
డిసెంబరు 1న చండికేశ్వర హోమం :
హోమ మహోత్సవాల్లో చివరి రోజైనా ఇవాళ (డిసెంబరు 1) చండికేశ్వర హోమం జరుగనుంది. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్రబాబు, ఆలయ అర్చకులు, అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
