స్వర్ణరథంపై శ్రీ భూ సమేత శ్రీ మలయప్పస్వామి కటాక్షం

తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. గురువారం ప్రారంభమైన ఈ ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. చైత్ర శుద్ధ పౌర్ణమికి ముగిసేలా తిరుమల తిరుపతి దేవస్థానం ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ వసంతోత్సవాల్లో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ అన్ని ఏర్పాట్లనూ ముందుగానే చేసింది. ఇక వసంతోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన శుక్రవారం ఉదయం శ్రీ మలయప్పస్వామి శ్రీదేవి, భూదేవి సమేతంగా తిరుమాడ వీధుల్లో స్వర్ణరథంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు.

ఇందులో భాగంగా ఉదయం 8 నుండి 10 గంటల నడుమ అత్యంత వైభవంగా సాగిన స్వర్ణరథోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని గోవిందనామాలు జపిస్తూ రథాన్ని లాగారు. స్వర్ణరథోత్సవాన్ని దర్శించడంవల్ల- లక్ష్మీదేవి కరుణతో సంపదలు, భోగభాగ్యాలూ, భూదేవి కరుణతో, సమస్తధాన్యాలూ, శ్రీవారికరుణతో సర్వశుభాలూ, సుఖాలూ చేకూరుతాయని భక్తుల విశ్వాసం. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ, డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, వీజీవో శ్రీ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Share this post with your friends